మునుగోడులో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు డేట్ ఫిక్స్

by Disha Web Desk 4 |
మునుగోడులో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు డేట్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడులో ఈ నెల 20న భారీ బహిరంగసభ నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు సూచించారు. ప్రగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ మునుగోడు బైపోల్ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. నియోజకవర్గ వివరాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై సైతం చర్చ జరిగింది. అసంతృప్త వాదుల అభిప్రాయాలను సైతం భేటీలో చర్చించారు. ఈ నెల 21న బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు ఒక రోజు ముందుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ కు ప్రజలు బాసటగా ఉన్నారన్నారు. గెలుపు టీఆర్ఎస్ దేనని, అందుకు అందరూ సమీష్టిగా పనిచేయాలని సూచించారు. సభ విజయవంతం చేసి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపాలని, ఈ సభతోనే టీఆర్ఎస్ సత్తా చాటాలని సూచించారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరూ కూడా అభ్యర్థి విషయంలో నోరు జారోద్దని , అభ్యర్థి ప్రకటన పార్టీ చూసుకుంటుందని, క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ ఇన్ చార్జీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మునుగోడులో బీజేపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ భారీ ప్లాన్

Next Story

Most Viewed